తిరుప్పావై పాశురాలు తెలుగులో అర్ధం
గోదాదేవిగా జన్మించిన ఆండాళ్- శ్రీ మహావిష్ణువును భర్తగా పొందాలనే తలపుతో ధనుర్మాసంలో సంకల్పించిన వ్రతమే తిరుప్పావై. ఈ వ్రతం ఇప్పటికీ మహిళలు ఆచరిస్తుంటారు. ధనుర్మాసం మొదటిరోజున ఈ వ్రతాన్ని ఆరంభించి, ఒక్కో రోజు ఒక్కో పాశురం చొప్పున 30 రోజులు గానం చేసి, భోగిరోజున ఆండాళ్- శ్రీరంగనాథుల కల్యాణం జరిపించడంతో ఈ వ్రతం ముగుస్తుంది. ఈ తిరుప్పావై లో 30 పాశురాలు ఉంటాయి. ఈ పాశురాలు మంచి అలవాట్లతో జీవించమని, తోటివారికి సాయపడమని, భగవంతుని ఆరాధించమని సూచిస్తాయి. ఉదయాన్నే గోదాదేవి ఒక్కొక్కరింటికి వెళ్ళి, తన చెలులను తట్టి లేపుతూ, వారిని ఈ వ్రతం చేయడానికి సిద్ధం చేస్తుంది. గోదాదేవి రచించిన ఈ తిరుప్పావై- ఆళ్వార్లు రచించిన నాలాయిర దివ్య ప్రబంధంలో ఒక ముఖ్య భాగమై, తమిళ సాహిత్యంలో ఒక విశిష్ట స్థానాన్ని సంపాదించుకుంది.
ఈరోజు నుండి ధనుర్మాసం ప్రారంభం. ఈ సందర్భంగా తిరుప్పావైలోని పాశురాలను, వాటి అర్థాలను ఈరోజు నుండి తెలుసుకుందాం.
నీళా తుంగ స్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం
పారార్థ్యం స్వం శ్రుతిశతశిరః సిద్ధమధ్యాపయంతీ |
స్వోచ్ఛిష్టాయాం స్రజి నిగళితం యా బలాత్కృత్య భుంక్తే
గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః ||
అన్న వయల్ పుదువై యాణ్డాళ్ అరంగర్కు
పన్ను తిరుప్పావై ప్పల్ పదియమ్, ఇన్నిశైయాల్
పాడిక్కొడుత్తాళ్ నఱ్పామాలై,
పూమాలై శూడిక్కొడుత్తాళై చ్చొల్లు,
శూడిక్కొడుత్త శుడర్కొడియే తొల్పావై,
పాడియరుళవల్ల పల్వళైయాయ్, నాడి నీ
వేంగడవఱ్కెన్నై విది యెన్ఱ ఇమ్మాట్రమ్,
నాన్ కడవా వణ్ణమే నల్కు.
పాశురం – 1
మార్గళి’త్ తింగళ్ మదినిఱైన్ద నన్నాళాల్ ,
నీరాడ ప్పోదువీర్ పోదుమినో నేరిళై’యీర్ ,
శీర్ మల్గుమాయ్పాడి శెల్వచ్చిఱుమీర్గాళ్ ,
కూర్ వేల్ కొడున్దొళి’లన్ నన్దగోపన్ కుమరన్ ,
ఏరార్న్ద కణ్ణి యశోదై యిళం శిఙ్గం ,
కార్మేని చ్చెంగణ్ కదిర్ మతియమ్బోల్ ముగత్తాన్,
నారాయణనే నమక్కే పఱై తరువాన్ ,
పారోర్ పుగళ’ ప్పడిన్దేలోరెమ్బావాయ్ || 1 ||

భావం: రకరకాలైన మెరిసే బంగారపు ఆభరణములను సింగారించిన యువతుల్లారా, సిరి సంపదలతో సమృద్దిగా నిండిన వ్రేపల్లెలో, ఐశ్వర్యవంతురాలైన ఆ లక్ష్మీదేవి వలె కళకళలాడే యువతుల్లారా, రండి. మనము విరహ వేదనలో కొట్టుకొని పోకుండా, ఆ కృష్ణుడిలో లీనమయ్యే వ్రతమును ఆచరించడానికి కావలసినట్లుగా, మన మనస్సు, మన శరీరము పావనము అయ్యేట్టుగా స్నానము చేద్దాము రండి. మార్గశిర మాసములో, శుక్ల పక్షములో, ఆకాశములో నిండు చంద్రుడు తన తెల్లని, చల్లని పండు వెన్నెలను వెదజల్లే శుభదినములలో, పదునైన బల్లెముతో ధేనుకాసురుడు వంటి క్రూరరాక్షసులను శిక్షించిన స్వామికి, గోప కుల రాజు అయిన నందగోపుడి ముద్దుల కొడుకుకి పూజ చేద్దాము రండి. విశాలమైన కన్నులు కలిగిన సౌందర్యవతి ఆ యశోదాదేవికి గారాల ముద్దుబిడ్డడు, గంభీరమైన సింహపు పిల్ల వంటి హుందా కలిగిన నల్లని శ్రీకృష్ణుడికి, సూర్య చంద్రుల వంటి దివ్య నేత్రములు కలిగిన స్వామికి, అన్ని లోకములలోని వారందరూ ఎన్నో రకాల ప్రయోజనాలను ఆశిస్తూ పూజించే ఆ భగవంతుడికి, ఎంతో గొప్ప పురుషార్థమైన ఆ పరమ పద మోక్షమును పొందడానికి పూజించే ఆ శ్రీమన్నారాయణుడికి, కోరిన కోరికలను తీర్చే ఆ శ్రీకృష్ణుడికి, అందరము కలిసి పూజ చేద్దాము రండి” అంటూ ఆండాళ్, గోపికలను పిలుస్తోంది.
ఈ విషయాన్ని వీడియో రూపంలో చూడాలంటే, క్రింది వీడియో చూడండి.👇👇👇👇

