గర్భరక్షాంబికా ఆలయం,పిల్లలు లేనివాళ్లు ఇక్కడికి వెళ్తే వెంటనే పిల్లలు పుడతారు
దేవుడు అన్ని చోట్లా సర్వవ్యాప్తుడై ఉన్నా, కొన్ని ప్రదేశాల్లో కొన్ని రూపాలలో విశేషంగా ఆయన అనుగ్రహం కలుగుతూ ఉంటుంది. వీటినే పుణ్యక్షేత్రాలు అంటారు. పుణ్యక్షేత్రాల్లో ఒక్కో క్షేత్రం ఒక్కో కారణానికి ప్రసిద్ధి చెందింది. అలాంటి పుణ్యక్షేత్రాలలో ఒకటి గర్భరక్షాంబికా ఆలయం.గర్భరక్షాంబికా ఆలయం సంతాన ప్రాప్తి, ఇక్కడ అమ్మవారు స్త్రీలలో గర్భసంబంధిత లోపాలను తొలగించి సంతానప్రాప్తిని కటాక్షించే తల్లిగా వెలసింది. గర్భిణీ స్త్రీలకు సుఖప్రసవం కలగజేయడానికి సాక్షాత్తు జగన్మాత గర్భరక్షాంబికా అమ్మవారిగా భూమిపై అవతరించిందని స్థలపురాణం చెబుతోంది. ఈ అమ్మవారిని మొక్కుకుంటే సుఖప్రసవం జరిగి తల్లి, బిడ్డలు క్షేమంగా ఉంటారనే నమ్మకం వేల ఏళ్లుగా కొనసాగుతోంది. సంతానం లేక బాధపడే స్త్రీలతో పాటు గర్భిణీలు, పిల్లల తల్లులు ఈ అమ్మవారిని భక్తిశ్రద్ధలతో పూజిస్తారు. అమ్మవారి ఆశీస్సులతో పిల్లలకు సంబంధించిన సమస్యలు తొలగిపోతాయని పెద్దలు చెబుతారు.
గర్భరక్షాంబికా సమేత శ్రీ ముల్లైవనాథర్ ఆలయం తమిళనాడు రాష్ట్రంలోని తంజావూరు జిల్లా, పాపనాశనం తాలూకా, తిరుకరుకవూర్లో ఉంది. ఈ ఆలయంలో అమ్మవారు సుమారు ఏడు అడుగుల ఎత్తులో, కంచిపట్టు చీర ధరించి సర్వాలంకారభూషితగా దర్శనమిస్తారు. చిరునవ్వుతో భక్తులకు అభయమిస్తూ, సంతానప్రాప్తిని అనుగ్రహించేందుకు సిద్ధంగా ఉన్నట్లుగా కనిపిస్తారు. ఇదే క్షేత్రంలో పరమేశ్వరుడు శ్రీ ముల్లైవనాథర్గా స్వయంభువుగా వెలసాడు. తమిళంలో “ముల్లై” అంటే మల్లెపూలు. మల్లెల వనంలో శివలింగం లభ్యమవడంతో స్వామివారికి ముల్లైవనాథర్ అనే పేరు వచ్చింది. ఈ స్వామిని పూజిస్తే చర్మవ్యాధులు నయమవుతాయని భక్తుల విశ్వాసం. శంకరుడు స్వయంభువుగా వెలసిన 64 క్షేత్రాలలో ఇదొకటి. ఇక్కడి శివలింగం పుట్టమన్నుతో ఏర్పడినది కావున జలాభిషేకం చేయకుండా మల్లె నూనెతో అభిషేకం చేస్తారు.
ఈ క్షేత్రాన్ని మాధవి క్షేత్రం అని కూడా అంటారు. మాధవి అంటే సంస్కృతంలో మల్లెపూలు. ప్రతి సంవత్సరం తమిళ ఫాల్గుణ మాస పౌర్ణమి నాడు శివలింగంపై చంద్రకిరణాలు నేరుగా పడటం ఒక అద్భుత దృశ్యం. ఇక్కడ కర్పగ వినాయకర్, నందీశ్వరుడు స్వయంభువుగా వెలసారు. శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి సన్నిధి కూడా ఉంది. ఈ ఆలయం ఏడవ శతాబ్దంలో చోళుల కాలంలో ద్రావిడ నిర్మాణశైలిలో నిర్మించబడింది. చోళరాజుల కాలానికి చెందిన శిలాఫలకాలు ఇక్కడ కనిపిస్తాయి. రాజరాజ చోళుడు, రాజేంద్ర చోళుడు, కులోత్తుంగ చోళుడు ఈ ఆలయ అభివృద్ధికి కృషి చేశారు. పంచారణ్య స్థలాలలో ఇదొకటి. ఈ ఐదు ఆలయాలను ఒకే రోజులో దర్శిస్తే పుణ్యం లభిస్తుందని భక్తుల విశ్వాసం.
స్థలపురాణం ప్రకారం పూర్వం ఇక్కడ నిద్రువ మహర్షి, ఆయన ధర్మపత్నీ వేదిక ఆశ్రమంలో నివసించేవారు. సంతానం లేక బాధపడుతూ పార్వతీ పరమేశ్వరులను ఆరాధించారు. వేదిక గర్భవతిగా మారిన తర్వాత ఊర్ధ్వపాద మహర్షి శాపంతో గర్భానికి ప్రమాదం ఏర్పడింది. ఆపదలో పార్వతీమాత ప్రత్యక్షమై గర్భస్థ శిశువును పవిత్ర కుండలో ఉంచి రక్షించింది. ఆ శిశువు తర్వాత సురక్షితంగా జన్మించాడు. మహర్షి ప్రార్థనతో శివపార్వతులు ఇక్కడే గర్భరక్షాంబికా, ముల్లైవనాథర్ రూపాలలో కొలువై ఉన్నారు.
ఇప్పటికీ ఈ క్షేత్రాన్ని దర్శించిన గర్భిణీలకు సుఖప్రసవం జరుగుతుందని భక్తుల నమ్మకం. సంతానం లేని దంపతులు గర్భరక్షాంబికా హోమం చేయించుకుని, అర్చన చేసిన నెయ్యిని 48 రోజులు సేవిస్తే గర్భదోషాలు తొలగి సంతానం కలుగుతుందని విశ్వాసం. గర్భిణీలు ఆలయంలో ఇచ్చే ఆముదం ప్రసాదాన్ని ఆరవ నెల నుండి పొత్తికడుపుపై రాస్తే సుఖప్రసవం జరుగుతుందని చెబుతారు.
గర్భిణీలు స్వయంగా రాలేకపోయినా వారి భర్తలు లేదా బంధువులు పేరుతో సంకల్పం చేసి నెయ్యి లేదా ఆముదం ప్రసాదం తీసుకురాగలరు. ప్రతినెల జన్మనక్షత్రం రోజున అర్చన చేయించుకోవచ్చు.
అమ్మవారిని ఉదయం 5:30 నుండి మధ్యాహ్నం 12:30 వరకు, సాయంత్రం 4:00 నుండి రాత్రి 8:00 వరకు దర్శించవచ్చు. ఉదయం 8:00 నుండి 8:30 వరకు అభిషేకం జరుగుతుంది. తంజావూరు–కుంభకోణం మార్గంలో, కుంభకోణం పట్టణానికి సుమారు 20 కి.మీ దూరంలో ఆలయం ఉంది. రైలులో రావాలంటే పాపనాశనం స్టేషన్లో దిగాలి. అక్కడి నుండి ఆలయం 6 కి.మీ దూరంలో ఉంటుంది. సమీప విమానాశ్రయం తిరుచిలో ఉంది.
ఈ సమాచారం మీకు ఉపయోగపడిందని ఆశిస్తున్నాను. నమస్కారం.
ఈ సమాచారాన్ని వీడియొ రూపంలో చూడాలనుకుంటే ఈ లింక్ ఓపెన్ చేసి వీడియొ చూడండి 👇👇👇. మరెంతో ఆధ్యాత్మిక, ధార్మిక సమాచారం కోసం భారతీయ సంస్కృతి ఛానల్ ను subscribe చేసుకోండి.





