తీర్థం ఎలా తీసుకోవాలి ? ప్రయోజనాలేంటి?
హిందూ సాంప్రదాయాల ప్రకారం దేవాలయాలను దర్శించడం పురాతన కాలం నుండి ఒక ఆనవాయితీగా వస్తోంది. దేవాలయాలను సందర్శించినప్పుడు దైవదర్శనం అయిన తర్వాత అర్చక స్వాములు తీర్థాన్ని ఇస్తారు. వారి అనుగ్రహం మనకు కలగాలని తీర్థం తీసుకుంటాం. అసలు ఈ తీర్థం వెనుక పరమార్థం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
సూక్తం, పంచసూక్తం మొదలైన మంత్రాలతో దేవతా మూర్తిని అర్చించి, అభిషేకించి, అర్ఘ్య, పాద్య, ఆచమనం సమర్పించి, తర్వాత పవిత్ర జలానికి తులసి దళాలను చేర్చి అర్చన చేసిన తరువాత ముందుగా అర్చక స్వాములు స్వీకరిస్తారు. తర్వాత తీర్థాన్ని సన్యసించిన వారికి, గురువులకు, యజమానులైన ధర్మకర్తలకు, ఆ తర్వాత భక్తులకు ఇస్తారు. మూడుసార్లు తీర్థం ఇచ్చేటప్పుడు ఈ మంత్రం పఠిస్తారు: “అకాలమృత్యు హరణం, సర్వవ్యాధి నివారణం, సమస్త పాపక్షయం, శ్రీ పరమేశ్వర పాదోదకం పావనం శుభం.” అంటే తీర్థం సేవించడం ద్వారా అకాల మరణం, సర్వ రోగాలు, సమస్త పాపాలు నివారింపబడతాయి మరియు ఉపశమనం కలుగుతుంది.
దాన్ని ఎలా తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఆచారం ప్రకారంగా చూస్తే తీర్థం తీసుకోవడానికి ఒక మన పద్ధతి ఉంది. మగవారు తమ భుజంపై ఉన్న ఉత్తరీయం లేదా కండువాను, మహిళలు చీర కొంగును ఎడమ చేతిలో వేసుకోవాలి. ఈ వస్త్రం పైన కుడి చేతిని ఉంచాలి. బొటనవేలు శుక్రుడిని సూచిస్తుంది, చూపుడువేలు గురువును సూచిస్తుంది. చూపుడువేలిని బొటనవేలుతో బంధించాలి. దీనిని గోముఖ ముద్ర అంటారు. మినప గింజ మునిగేంత ప్రమాణం ఉన్న తీర్థాన్ని కింద పడకుండా, శబ్దం చేయకుండా, పెదాలకు లేదా పంటికి అంటకుండా నాలుకపై వేసుకోవాలి. పెదవులకు తాకడం వల్ల ఎంగిలి అవుతుంది. తాగేటప్పుడు చరణదోషం తగలకుండా జాగ్రత్తపడాలి. చేతిలో ఉన్న బ్రహ్మ తీర్థం అనగా అరచేతిలోని నిలువు రేఖ ద్వారా తీసుకోవాలి. దీనిని ఆయుర్దాయ రేఖ అని కూడా అంటారు. దీని వల్ల ఆయుర్దాయం పెరిగి అకాల మృతి దోషం తొలగిపోతుందని భగవంతుని స్మరిస్తూ భక్తిశ్రద్ధలతో వినమ్రపూర్వకంగా తాగాలి.
తీర్థం తాగిన తర్వాత కుడి చేతిని తలపై రాయ కూడదు. చేతిలోని వస్త్రానికి తుడుచుకోవాలి. తలపై బ్రహ్మరంధ్రం ఉంటుంది. అది బ్రహ్మదేవుని స్థానం అని భావిస్తారు. మన చేతిని తలపై పూయడం వల్ల ఆ స్థానాన్ని అపవిత్రం చేసినవారమవుతాం.
ఉదయకాలంలో తులసి జలం, సాయంకాలంలో బిల్వ జలం అంటే మారేడు జలాన్ని తీర్థంగా ఇస్తారు. తులసి తీర్థం శ్వాసకోశాన్ని శుభ్రపరుస్తుంది. బిల్వ జలం జీర్ణకోశాన్ని శుభ్రపరుస్తుంది. తీర్థం తీసుకునేటప్పుడు కూర్చుని తీసుకోవాలి. దేవాలయాల్లో మాత్రం నిలబడి తీర్థం తీసుకోవాలి. తీర్థాన్ని మూడుసార్లు తీసుకోవాలి. ఎందుకంటే మొదటిసారి తీర్థంతో శారీరక, మానసిక శుద్ధి జరుగుతుంది. రెండోసారి తీర్థం తీసుకోవడం వల్ల న్యాయధర్మ ప్రవర్తనలు అలవడుతాయి. మూడోసారి పవిత్రమైన పరమేశ్వరుని పరమపదాన్ని అనుకుంటూ తీసుకోవాలి.
దేవాలయాలలో తీర్థాలు అనేక రకాలుగా ఉంటాయి. జల తీర్థం స్వామివారికి అభిషేకం నిర్వహించిన ఆ నీటిని జలతీర్థంగా భావిస్తారు. ఈ తీర్థం సేవించడం వల్ల అకాల మరణం, సర్వరోగాలు నివారించబడతాయి. విష్ణువుకు సంబంధించిన ఆలయాల్లో పచ్చ తులసి తీర్థం భక్తులకు ఇస్తారు. శివాలయాల్లో మారేడు దళాలు వేసిన తీర్థం ఇస్తారు. అమృత తీర్థం స్వచ్ఛమైన ఆవుపాలు, తియ్యటి పెరుగు, పరిశుభ్రమైన నెయ్యి, సిద్ధమైన తేనె, పటికబెల్లంతో తయారైన పంచామృతం. ఇది ఔషధ గుణాల సంజీవని. త్వరగా జీర్ణమవడమే కాక శరీరానికి అవసరమైన క్యాల్షియంను అందిస్తుంది. జీర్ణ సంబంధ వ్యాధులను నయం చేస్తుంది, శక్తినిస్తుంది.
పానక తీర్థం కొన్ని దేవాలయాల్లో దేవునికి నైవేద్యంగా పానకాన్ని సమర్పించడం ద్వారా అక్కడికి వచ్చే భక్తులకు ప్రసాదిస్తారు. ఇది శరీరంలోని వేడిని తగ్గిస్తుంది. జ్ఞాపకశక్తి మెరుగుపడుతుంది. శరీరం చురుకుగా తయారవుతుంది. బుద్ధి చురుకుగా పనిచేస్తుంది.
కాషాయ తీర్థంలో తులసి దళాలు, బిల్వ దళాలు, ఏలకులు, మిరియాలు తదితర సుగంధ ద్రవ్యాలను కలపడం ద్వారా ఎన్నో ఆరోగ్య సమస్యల నుండి విముక్తి పొందవచ్చు. అందుకే దేవాలయాన్ని దర్శించినప్పుడు తీర్థప్రసాదం తప్పనిసరిగా సేవించాలి.
హిందూ సంప్రదాయాలను ఆచరిద్దాం. మన సంస్కృతి సంప్రదాయాలను మన పిల్లలకు, భావితరాలకు చేరవేద్దాం.
ఈ సమాచారాన్ని వీడియొ రూపంలో చూడాలనుకుంటే ఈ లింక్ ఓపెన్ చేసి వీడియొ చూడండి 👇👇👇. మరెంతో ఆధ్యాత్మిక, ధార్మిక సమాచారం కోసం భారతీయ సంస్కృతి ఛానల్ ను subscribe చేసుకోండి.

