పిల్లి శకునం మంచిదా? కాదా? దాని వెనకున్న రహస్యం
భారతదేశంలో ఎన్నో సంప్రదాయాలతో పాటు అనేక నమ్మకాలు కూడా ఉన్నాయి. ఏదైనా పని ప్రారంభించే సమయంలో కొన్ని నియమాలు పాటిస్తూ ఉంటారు. వాటిలో ఒకటి “పిల్లి శకునం”. శుభకార్యాలకు లేదా ముఖ్యమైన పనుల నిమిత్తం బయటకు వెళ్తున్నప్పుడు ఎదురుగా పిల్లి వస్తే మంచిది కాదని భావించి కొందరు వెనక్కి తిరిగి వస్తారు.
పిల్లి ఎదురుపడితే ఏమవుతుంది? ఈ శకునం వెనుక ఉన్న అసలు ఉద్దేశం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
పూర్వకాలంలో ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి ప్రయాణం చేయాలంటే ఎడ్ల బండి లేదా గుర్రపు బండి ఉపయోగించేవారు. ఆ సమయంలో పిల్లి ఎదురొస్తే దాన్ని అపశకునంగా భావించేవారు. కారణం ఏమిటంటే, చీకటిలో పిల్లి కళ్ళు మెరిసినట్లు కనిపిస్తాయి. పిల్లి మాత్రమే కాదు, సింహం వంటి ఇతర జంతువుల కళ్ళు కూడా మెరుస్తాయి.
జంతువుల కళ్ల వెనుక భాగంలో “టపేటం లూసిడం” అనే ప్రత్యేకమైన పొర ఉంటుంది. ఈ పొర కాంతిని పరావర్తనం చేసే లక్షణం కలిగి ఉంటుంది. ఇది కుంభాకార దర్పణం లా పనిచేస్తుంది. కాంతి కిరణాలు ఈ పొరపై పడినప్పుడు అవి తిరిగి ప్రతిఫలించి మన కంటికి చేరుతాయి. అందువల్లే జంతువుల కళ్ళు మెరిసినట్లు కనిపిస్తాయి. ఈ ప్రత్యేకమైన నిర్మాణం వల్లనే అవి చీకటిలో కూడా స్పష్టంగా చూడగలుగుతాయి.
చీకటిలో లేదా పగలైనా అకస్మాత్తుగా జంతువుల కళ్ళు మెరుస్తే ఎడ్లు, గుర్రాలు భయంతో బెదిరిపోతాయి. అవి ఆందోళనకు గురై నియంత్రణ కోల్పోతే ప్రయాణం సజావుగా సాగదు. ప్రమాదం జరిగే అవకాశం కూడా ఉంటుంది. అందుకే బయటకు వెళ్తున్నప్పుడు పిల్లి ఎదురైతే దాన్ని అపశకునంగా భావించి కొంతసేపు ఆగి, జంతువులు స్థిమితపడిన తరువాతే ప్రయాణం కొనసాగించేవారు.
ప్రస్తుతం ఎడ్ల బండ్లు, గుర్రపు బండ్లు ప్రయాణాలకు ఎక్కువగా ఉపయోగించడం లేదు. అయితే ఆచారాలు, నమ్మకాలు చాలాసార్లు అర్థవంతమైన కారణాలతో ఏర్పడతాయి. వాటి వెనుక ఉన్న నిజాన్ని తెలుసుకుని, కాలానుగుణంగా అవి ఎలా ఆచరించాలో మనమే నిర్ణయించుకోవాలి.
ఈ సమాచారాన్ని వీడియొ రూపంలో చూడాలనుకుంటే ఈ లింక్ ఓపెన్ చేసి వీడియొ చూడండి 👇👇👇. మరెంతో ఆధ్యాత్మిక, ధార్మిక సమాచారం కోసం భారతీయ సంస్కృతి ఛానల్ ను subscribe చేసుకోండి.

