లలితా సహస్రనామ ఫలశృతి 41-50 శ్లోకాలు తెలుగులో అర్థం
శ్రీలలితా సహస్రనామంలోని ఫలశ్రుతి భాగం, ఈ దివ్య నామాలను భక్తిశ్రద్ధలతో పారాయణం చేయడం వల్ల కలిగే మహిమలను వివరిస్తుంది. ఫలశ్రుతి ద్వారా ఈ సహస్రనామం కేవలం స్తోత్రమే కాక, భక్తుల జీవితాలను ఆధ్యాత్మికంగా మరియు లౌకికంగా ఉన్నత స్థితికి చేర్చే దివ్య సాధనమని తెలియజేయబడుతుంది. పరాశక్తి అయిన శ్రీలలితా మహాత్రిపురసుందరీ కృపను పొందడానికి ఈ నామాల జపం అత్యంత శ్రేష్ఠమైన మార్గంగా శాస్త్రాలు పేర్కొన్నాయి.
భక్తితో శ్రీలలితా సహస్రనామ ఫలశ్రుతిని చదవడం లేదా వినడం ద్వారా పాపక్షయం, ఆరోగ్యం, ఐశ్వర్యం, సంతానసౌభాగ్యం, విద్యా ప్రాప్తి, శత్రువుల నుండి రక్షణ వంటి అనేక శుభఫలితాలు లభిస్తాయని చెప్పబడింది. అంతేకాక, పరమాత్మసాక్షాత్కారం మరియు మోక్షప్రాప్తికి కూడా ఈ స్తోత్రం దోహదపడుతుందని ఫలశ్రుతి వివరిస్తుంది. ఇప్పుడు ఈ ఫలశ్రుతి శ్లోకాల యొక్క తెలుగు అర్థాన్ని తెలుసుకుందాం.
యస్త్వేకవారం పఠతి పక్షమాత్రమతంద్రితః
ముహ్యంతి కామవశగా మృగాక్ష్యస్తస్య వీక్షణాత్ || 41 ||
అలసత్వము, నిద్ర, కునికిపాటు లేకుండా 15 రోజుల పాటు, రోజుకొక్కసారి పారాయణము చేసినవారు, ఏ స్త్రీలను చూసినా ఆ స్త్రీలందరూ మన్మధావేశము కలవారై, మోహమును చెందుదురు.
యః పఠేన్నామసాహస్రం జన్మమధ్యే సకృన్నరః
తద్దృష్టిగోచరాః సర్వే ముచ్యంతే సర్వకిల్బిషైః || 42 ||
జీవితకాలంలో ఎప్పుడైనా ఒక్కసారి, సహస్ర నామ పారాయణమును చేసినవారిని చూసినా, పారాయణ చేసినవారిచే చూడబడినా పాపాలు నశిస్తాయి.
యో వేత్తి నామసాహస్రం తస్మై దేయం ద్విజన్మనే
అన్నం వస్త్రం ధనం ధాన్యం నాన్యేభ్యస్తు కదాచన || 43 ||
ఉపాసకులు ఎప్పుడు దానము చేయదలచినా సహస్ర నామపారాయణ చేసే బ్రాహ్మణునికే అన్నము, వస్త్రము, ధనము, ధాన్యమును ఈయవలెను. ఉపాసన చేయని వారికి ఎప్పుడూ ఇవ్వకూడదు.
శ్రీమంత్రరాజం యో వేత్తి శ్రీచక్రం యః సమర్చతి
యః కీర్తయతి నామాని తం సత్పాత్రం విదుర్బుధాః || 44 ||
శ్రీ విద్యా మంత్రము ఎరిగినవాడు, శ్రీ చక్ర పూజ చేయువాడు, సహస్ర నామ పారాయణ చేయువాడు – వీరు ముగ్గురూ దానం తీసుకోవడానికి మంచి యోగ్యులు.
తస్మై దేయం ప్రయత్నేన శ్రీదేవీప్రీతిమిచ్ఛతా || 45 ||
అలాంటి యోగ్యులకు అన్న, వస్త్రాలను దానమిస్తే, వారి మీద శ్రీదేవికి ప్రేమ కలుగుతుంది.
న కీర్తయతి నామాని మంత్రరాజం న వేత్తి యః || 46 ||
పశుతుల్యః స విజ్ఞేయః తస్మై దత్తం నిరర్థకమ్
పరీక్ష్య విద్యావిదుషః తేభ్యో దద్యాద్విచక్షణః || 47 ||
సహస్ర నామ పారాయణ చేయని వాడు, పంచదశీ మంత్రార్థము తెలియనివాడు పశువుతో సమానము. అలాంటివారికి దానం చేస్తే అది నిరర్థకమవుతుంది. కనుక వివేకవంతుడు, శ్రీ విద్యా పండితులను పరిశీలించి వారికే దానం చేయాలి.
శ్రీమంత్రరాజసదృశో యథా మంత్రో న విద్యతే
దేవతా లలితాతుల్యా యథా నాస్తి ఘటోద్భవ || 48 ||
రహస్యనామసాహస్రతుల్యా నాస్తి తథా స్తుతిః || 49 ||
ఓ అగస్త్యుడా! పంచదశాక్షరీ మంత్రముతో సమానమైన మంత్రము గానీ, లలితా దేవితో సమానమైన దేవత గానీ, రహస్యమైన లలితా సహస్రనామముతో సమానమైన స్తోత్రము గానీ లేదు.
లిఖిత్వా పుస్తకే యస్తు నామసాహస్రముత్తమమ్
సమర్చయేత్సదా భక్త్యా తస్య తుష్యతి సుందరీ || 50 ||
ఉపాసకుడైనా, ఉపాసకుడు కానివాడైనా ఎవరైనా సరే, ఈ సహస్ర నామములు పుస్తకంలో రాసి, భక్తితో, బ్రతికి ఉన్నంతకాలం పూజిస్తే వారిని చూసి దేవి సంతోషిస్తుంది.
ఇలాంటి మరిన్ని స్తోత్రాలు, శ్లోకాలు, భక్తి విషయాల కోసం మా వెబ్సైట్లోని ఇతర పోస్ట్లను తప్పక చూడండి.
ఎన్నో స్తోత్రాలు, వాటి అర్థాలు తెలుగులో తెలుసుకోవాలనుకుంటే మన “భారతీయ సంస్కృతి” YouTube ఛానల్ను సందర్శించండి. 🙏
👉 భారతీయ సంస్కృతి YouTube Channel Link
ఈ సమాచారాన్ని వీడియొ రూపంలో చూడాలనుకుంటే ఈ లింక్ ఓపెన్ చేసి వీడియొ చూడండి 👇👇👇. మరెంతో ఆధ్యాత్మిక, ధార్మిక సమాచారం కోసం భారతీయ సంస్కృతి ఛానల్ ను subscribe చేసుకోండి.



