శ్రావణ మాస మహాత్మ్యం – ఐదవ అధ్యాయం
పరమశివుడు, భక్తుడైన సనత్కుమారునితో శ్రావణ మాస విశేషాలను ఇంకా ఇలా చెప్పడం మొదలుపెట్టాడు.
“సనత్కుమారా! ఇప్పుడు నీకు అత్యంత పుణ్యప్రదమైన కోటి లింగాల మహిమ గురించి చెబుతాను విను. అసలు ఒక్క శివలింగం మహిమను వర్ణించడమే బ్రహ్మాది దేవతలకు సాధ్యం కాదు, అలాంటిది ఇక కోటి లింగాల మహిమను నేను ఎలా చెప్పగలను నాయనా? ఎవరికైతే కోటి లింగాలను పూజించే స్తోమత, శక్తి ఉండదో… వాళ్లు లక్ష లింగాలు కానీ, వెయ్యి లింగాలు కానీ, వంద లింగాలు కానీ… కనీసం ఒక్క లింగాన్ని మనసారా పూజించినా సరే, వాళ్ళు కైలాసంలో నా దగ్గరే ఉంటారు. ఓం నమః శివాయ మంత్రాన్ని శ్రద్ధగా జపించాలి.
శ్రావణ మాసంలో నాకు పంచామృతాలతో అభిషేకం చేసినవాళ్ళకు అకాల మృత్యువు అన్నదే దరిచేరదు. సంతాన ప్రాప్తి కలుగుతుంది, కష్టాలన్నీ ఇట్టే పోతాయి, ఐశ్వర్యం వృద్ధి చెందుతుంది. వాళ్ళు ఎప్పుడూ నా సన్నిధిలోనే ఉంటారు.
ఈ మాసంలో ఆహారం మానేసి హోమంలో మిగిలిన హవిస్సును (అన్నాన్ని) మాత్రమే తినేవాడు, ఎప్పుడూ అన్ని రకాల ధాన్యాలతో సుభిక్షంగా ఉంటాడు. శ్రావణ మాసంలో ఉదయాన్నే స్నానం చేస్తే, సంవత్సరం పొడవునా పవిత్ర నదుల్లో స్నానం చేసినంత పుణ్యం వస్తుంది. ఇంద్రియాలను అదుపులో పెట్టుకున్నవాడు అఖండమైన బలాన్ని పొందుతాడు. ఈ నెలలో ఏ లింగాన్నయినా సరే, అది మట్టితో చేసినదైనా లేదా వెన్నతో చేసినదైనా ఒక్కసారి పూజిస్తే చాలు, ఎన్నో బ్రహ్మహత్యా పాతకాలు పోతాయి.
అలాగే, ఈ మాసంలో జపాలు, ప్రదక్షిణలు, నమస్కారాలు చేస్తే వందల రెట్లు పుణ్యం వస్తుంది. నాకెంతో ఇష్టమైన ఈ మాసంలో వేద పారాయణం చేస్తే మంత్రాలన్నీ సిద్ధిస్తాయి. పురుష సూక్తంలోని అక్షరాలెన్ని ఉన్నాయో అన్ని వందల సార్లు దాన్ని శ్రద్ధగా పఠిస్తే… ఘోరమైన పాపాలు సైతం పటాపంచలైపోతాయి. దీనికి సమానమైన పాపపరిహార మార్గం మరొకటి లేదు.
ఇక వారాల ప్రకారం చేయాల్సిన వ్రతాల గురించి, ముఖ్యంగా ఆదివారం నాడు చేయాల్సిన వ్రతం, దాని వెనుక ఉన్న కథ చెబుతాను శ్రద్ధగా విను.
ఆదివార వ్రతం – సుకర్మ బ్రాహ్మణుడి కథ:
పూర్వం ప్రతిష్ఠాన నగరంలో ‘సుకర్మ’ అనే ఒక పేద బ్రాహ్మణుడు ఉండేవాడు. అతను భిక్షాటన చేస్తూ జీవించేవాడు. ఒకరోజు ఆ బ్రాహ్మణుడు భిక్షం కోసం ఆ ఊర్లో తిరుగుతుండగా, ఒక ఇంట్లో కొందరు ఆడవాళ్లు ఎంతో నిష్టగా ఆదివార వ్రతం చేసుకుంటున్నారు. అప్పుడు అక్కడికి సుకర్మ వచ్చాడని గమనించిన వారు, ఆ వ్రత విధానాన్ని బయటివారికి తెలియనీయకూడదని భావించి, అతనికి కనిపించకుండా దానిని దాచిపెట్టారు.
అది చూసిన ఆ పేద బ్రాహ్మణుడు, ‘ఓ తల్లులారా! మీరు చేస్తున్న వ్రతాన్ని నాకు ఎందుకు చూపించట్లేదు? పరోపకారానికి మించిన ధర్మం లేదు కదా. నేను చాలా పేదవాడిని, ఆ వ్రతం గురించి తెలుసుకుని నేను కూడా ఆచరించాలని ఆశపడుతున్నాను. దయచేసి నాకు చెప్పండి’ అని వేడుకున్నాడు.
అందుకు ఆ స్త్రీలు ‘ఓ బ్రాహ్మణుడా! నీకు భక్తి లేదు, శ్రద్ధ లేదు. ఈ వ్రతం గురించి చెబితే నువ్వు మధ్యలో మర్చిపోతావు లేదా ఏదైనా తప్పులు చేస్తావు. అందుకే నీకు చెప్పకూడదనుకున్నాం’ అన్నారు. కానీ అతను పదే పదే ప్రాధేయపడేసరికి, వారిలో ఒక ఆవిడ ఆ వ్రతం గురించి ఇలా వివరించింది.
ఆదివార వ్రత విధానం:
‘ఓ బ్రాహ్మణుడా! శ్రావణ మాసంలో వచ్చే మొదటి ఆదివారం నాడు ఉదయాన్నే మౌనంగా చల్లటి నీళ్లతో స్నానం చేయాలి. సంధ్యావందనం పూర్తి చేసుకుని, తమలపాకుల మీద పన్నెండు మండలాలు ఏర్పాటు చేయాలి. ఆ మండపంలో సూర్యుడి లాగా గుండ్రంగా ఎర్రటి గంధంతో గీసి, అందులో సంజ్ఞా, ఛాయా దేవులతో కూడిన సూర్యభగవానుడిని ఆవాహన చేయాలి. మోకాళ్ల మీద కూర్చుని పన్నెండు సార్లు అర్ఘ్యం ఇవ్వాలి. మందార పూలు, ఎర్రటి అక్షింతలు, గంధంతో సూర్యుడికి భక్తిగా పూజ చేయాలి.
కొబ్బరి ముక్కలు, పటికబెల్లం నైవేద్యంగా సమర్పించి, సూర్యుడి పన్నెండు మంత్రాలు చదువుతూ, పన్నెండు ప్రదక్షిణలు చేసి నమస్కరించాలి. ఆరు పోగులు ఉన్న దారానికి ఆరు ముడులు వేసి, ఆ తోరాన్ని సూర్యుడికి సమర్పించి చేతికి లేదా మెడలో కట్టుకోవాలి. పూజ ముగిశాక బ్రాహ్మణుడికి పన్నెండు పండ్లతో వాయనం ఇవ్వాలి.
ఈ వ్రతం చేయడం వల్ల దరిద్రుడికి ధనం వస్తుంది, పిల్లలు లేనివాళ్లకు పిల్లలు పుడతారు. దీర్ఘ రోగాలు నయమవుతాయి. ఈ వ్రత మహిమ వలన కారాగారంలో బంధింపబడిన వారికీ విముక్తి లభించి, వారు కూడా విడుదల పొందుతారు. ఒక్కమాటలో చెప్పాలంటే ఈ వ్రతం చేసినవాళ్లు ఏది కోరుకుంటే అది పొందుతారు. శ్రావణ మాసంలో వచ్చే నాలుగు లేదా ఐదు ఆదివారాలు ఈ వ్రతాన్ని ఆచరించి, చివరి వారం ఉద్యాపన చేయాలి’ అని ఆ స్త్రీలు అతనికి వివరించారు.

వారి మాటలు విన్న ఆ బ్రాహ్మణుడు ఎంతో సంతోషించి ఇంటికి వెళ్ళాడు. ఆ స్త్రీలు చెప్పినట్టే భక్తిగా వ్రతం చేశాడు. ఆ వ్రతం గురించి తన ఇద్దరు కూతుళ్లకు కూడా చెప్పాడు. తండ్రి ద్వారా ఈ పూజను చూడటం, కథను వినడం వల్ల ఆ వ్రత ప్రభావం చేత ఆ బ్రాహ్మణుడి కూతుళ్లిద్దరూ దేవతా కన్యల్లాగా ఎంతో అందంగా మారిపోయారు. అప్పటినుంచీ ఆ పేద బ్రాహ్మణుడి ఇంట్లో సాక్షాత్తూ ఆ లక్ష్మీదేవి కొలువైపోయింది. అతను గొప్ప ధనవంతుడిగా పేరు తెచ్చుకున్నాడు.
ఒకరోజు ఆ దేశపు రాజు వీధిలో వస్తూ ఆ బ్రాహ్మణుడి ఇంటి దగ్గరికి వచ్చేసరికి, కిటికీలో నుంచి ఆ అందమైన ఇద్దరు అమ్మాయిలు కనిపించారు. వాళ్ళను చూడగానే రాజు మనసు పారేసుకున్నాడు. వెంటనే ఆ బ్రాహ్మణుడిని పిలిపించి ఆయన కూతుళ్లను తనకిచ్చి పెళ్లి చేయమని అడిగాడు. అదృష్టం తలుపు తట్టడంతో బ్రాహ్మణుడు సంతోషంగా తన కూతుళ్లను రాజుకిచ్చి వివాహం జరిపించాడు.
సనత్కుమారా! చూశావా… ఆ రోజు నుంచి వాళ్లంతా పిల్లలు, మనవలతో సహా ఈ ఆదివార వ్రతాన్ని ఆచరిస్తూ సుఖంగా జీవించారు. ఇంతటి గొప్ప ఫలితాన్నిచ్చే ఈ వ్రత కథను విన్నంత మాత్రాన వ్రతం చేసినంత పుణ్యం దక్కుతుంది. భక్తుల కోరికలన్నీ నెరవేరుతాయి” అని పరమశివుడు ఆదివార వ్రత మహిమను వివరించాడు.
📥 ఈ అధ్యాయానికి సంబంధించిన తెలుగు PDF
ఈ అధ్యాయానికి సంబంధించిన పూర్తి తెలుగు PDFను డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటున్నారా?
మా Bharatiya Samskruthi YouTube Channelలో చాలా తక్కువ మొత్తంతో Membershipలో చేరి, ఈ అధ్యాయంతో పాటు రాబోయే శ్రావణ మాస మహాత్మ్యం అన్ని అధ్యాయాల PDFలను,ఇతర స్తోత్రాల తెలుగు అర్థం pdf లను సులభంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు.
🙏 ఈరోజే Memberగా చేరి అన్ని PDFలను పొందండి.
ఓం నమః శివాయ! 🕉️
శ్రావణ మాస మహాత్మ్యం
మొదటి అధ్యాయం: శ్రావణ మాస విశిష్టత
రెండవ అధ్యాయం: వ్రత నియమాలు, విశేషాలు
మూడవ అధ్యాయం: నక్త వ్రత పూజా విశేషాలు
నాలుగవ అధ్యాయం: విశేష వ్రతాలు, రుద్ర వర్తి వ్రత మహిమ
ఐదవ అధ్యాయం: కోటి లింగాల మహిమ, ఆదివార వ్రతం
ఆరవ అధ్యాయం: సోమవార వ్రత విశిష్టత
ఏడవ అధ్యాయం: మంగళగౌరీ వ్రత మహిమ, శ్రుతకీర్తి రాజు కథ
ఎనిమిదవ అధ్యాయం: బుధ, గురువార వ్రత విశిష్టత
తొమ్మిదవ అధ్యాయం: జీవంతికా దేవి వ్రత మహిమ
పదవ అధ్యాయం: శనివార వ్రత విశేషాలు
పదకొండవ అధ్యాయం: రోటక వ్రతం, ఔదుంబర వ్రత విశిష్టత
పన్నెండవ అధ్యాయం: స్వర్ణ గౌరీ వ్రత విశిష్టత
పదమూడవ అధ్యాయం: దూర్వా గణపతి వ్రత విశిష్టత
పదునాలుగవ అధ్యాయం: నాగ పంచమి వ్రత విశేషాలు
పదిహేనవ అధ్యాయం: సూపోదన వ్రతం, నాగ పంచమి విశేషాలు
పదహారవ అధ్యాయం: శీతలాష్టమి వ్రత విశిష్టత
పదిహేడవ అధ్యాయం: పవిత్రారోపణ వ్రతం, కుమారి పూజా మహిమ
పద్దెనిమిదవ అధ్యాయం: ఆషాఢ శుక్ల దశమి వ్రత మహిమ
పంతొమ్మిదవ అధ్యాయం: ఏకాదశీ వ్రతం, పవిత్రారోపణ వ్రత విశేషాలు
ఇరవయ్యవ అధ్యాయం: త్రయోదశీ మన్మథ పూజ, చతుర్దశి వ్రత విశేషాలు
ఇరవై ఒకటవ అధ్యాయం: త్రిమోదకి వ్రతం, రక్షాబంధన విశిష్టత
ఇరవై రెండవ అధ్యాయం: సంకష్టహరణ చతుర్థీ వ్రత మహిమ
ఇరవై మూడవ అధ్యాయం: శ్రీకృష్ణ జన్మాష్టమి వ్రత విశేషాలు
ఇరవై నాలుగవ అధ్యాయం: శ్రీకృష్ణ జన్మాష్టమి వ్రత మహిమ – ముగింపు
“శ్రావణ మాస మహాత్మ్యం ద్వారా మనం ఎన్నో వ్రతాల విశిష్టతలను, వాటి ఆధ్యాత్మిక ప్రయోజనాలను తెలుసుకున్నాం. ఈ పవిత్ర మాసంలో భక్తితో ఆచరించే ప్రతి వ్రతం మన జీవితంలో సుఖసంతోషాలను నింపుతుంది.
ఈ అద్భుతమైన సిరీస్పై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా 👉 భారతీయ సంస్కృతి YouTube Channel Link సబ్స్క్రైబ్ చేసుకోండి. హర హర మహాదేవ!”
ఈ సమాచారాన్ని వీడియొ రూపంలో చూడాలనుకుంటే ఈ లింక్ ఓపెన్ చేసి వీడియొ చూడండి 👇👇👇. మరెంతో ఆధ్యాత్మిక, ధార్మిక సమాచారం కోసం భారతీయ సంస్కృతి ఛానల్ ను subscribe చేసుకోండి.








