శ్రీ విష్ణు సహస్రనామ ఫలశ్రుతి తెలుగులో అర్థం 1-10 శ్లోకాలు
శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం ఎంతో పవిత్రమైనది, శక్తివంతమైనది. ‘ఉత్తర పీఠిక‘ లేదా ‘ఫలశ్రుతి‘ లోని శ్లోకాలను, వాటి సంపూర్ణ అర్థాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈ ఫలశ్రుతి పఠించడం లేదా వినడం వల్ల సకల రోగాలు, భయాలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని సాక్షాత్తు వ్యాస మహర్షి మహాభారతంలో వివరించారు. ప్రశాంతమైన మనసుతో, ఈ శక్తివంతమైన ఫలశ్రుతి అర్థాన్ని వినండి.
ఉత్తర పీఠికా (ఫలశ్రుతిః)
ఇతీదం కీర్తనీయస్య కేశవస్య మహాత్మనః ।
నామ్నాం సహస్రం దివ్యానామశేషేణ ప్రకీర్తితం। ॥ 1 ॥
భీష్మ పితామహుడు ధర్మరాజుతో ఇలా అన్నాడు. కీర్తించదగినవాడు, మహాత్ముడు అయిన ఆ కేశవుని దివ్యమైన ఈ వెయ్యి నామాలు ఎటువంటి శేషము లేకుండా సంపూర్ణంగా చెప్పబడ్డాయి.
య ఇదం శృణుయాన్నిత్యం యశ్చాపి పరికీర్తయేత్॥
నాశుభం ప్రాప్నుయాత్ కించిత్సోఽముత్రేహ చ మానవః ॥ 2 ॥
ఏ మానవుడైతే ఈ విష్ణు సహస్రనామాలను నిత్యం వింటాడో లేదా స్వయంగా పఠిస్తాడో, అతనికి ఇహలోకంలో కానీ, పరలోకంలో కానీ ఎటువంటి అశుభము కలుగదు.
వేదాంతగో బ్రాహ్మణః స్యాత్ క్షత్రియో విజయీ భవేత్ ।
వైశ్యో ధనసమృద్ధః స్యాత్ శూద్రః సుఖమవాప్నుయాత్ ॥ 3 ॥
ఈ స్తోత్రాన్ని పఠించడం వల్ల బ్రాహ్మణుడు వేదాంత జ్ఞానాన్ని పొందుతాడు, క్షత్రియుడు అఖండ విజయాలను సాధిస్తాడు, వైశ్యుడు అపారమైన ధనసంపదలను పొందుతాడు, శూద్రుడు (ఇతర వృత్తుల వారు) సకల సుఖాలను పొందుతారు.
ధర్మార్థీ ప్రాప్నుయాద్ధర్మమర్థార్థీ చార్థమాప్నుయాత్ ।
కామానవాప్నుయాత్ కామీ ప్రజార్థీ చాప్నుయాత్ప్రజామ్ ॥ 4 ॥
ధర్మం కావాలనుకునేవాడు ధర్మాన్ని, ధనం కోరుకునేవాడు ధనాన్ని, కోరికలు తీరాలనుకునేవాడు కోరికలను, సంతానం కావాలనుకునేవాడు సత్సంతానాన్ని నిశ్చయంగా పొందుతారు.
భక్తిమాన్ యః సదోత్థాయ శుచిస్తద్గతమానసః ।
సహస్రం వాసుదేవస్య నామ్నామేతత్ ప్రకీర్తయేత్ ॥ 5 ॥
యశః ప్రాప్నోతి విపులం యాతిప్రాధాన్యమేవ చ ।
అచలాం శ్రియమాప్నోతి శ్రేయః ప్రాప్నోత్యనుత్తమం। ॥ 6 ॥
ఎవరైతే భక్తిశ్రద్ధలు గలవాడై, నిత్యం ఉదయాన్నే నిద్రలేచి శుచిగా స్నానమాచరించి, ఏకాగ్రతతో ఈ వెయ్యి నామాలను కీర్తిస్తాడో… అట్టి వాడు గొప్ప కీర్తిని, తన బంధుమిత్రులలో విశేషమైన స్థానాన్ని గౌరవాన్ని, స్థిరమైన సంపదను, అత్యుత్తమమైన శ్రేయస్సును పొందుతాడు.
న భయం క్వచిదాప్నోతి వీర్యం తేజశ్చ విందతి ।
భవత్యరోగో ద్యుతిమాన్ బలరూప గుణాన్వితః ॥ 7 ॥
ఈ నామాలను జపించేవాడికి ఎక్కడా ఎటువంటి భయం ఉండదు. గొప్ప శౌర్యాన్ని, తేజస్సును పొందుతాడు. అతడు రోగాలు లేకుండా సంపూర్ణ ఆరోగ్యంతో, కాంతివంతంగా, బలం, సద్గుణాలతో శోభిస్తాడు.
రోగార్తో ముచ్యతే రోగాద్బద్ధో ముచ్యేత బంధనాత్ ।
భయాన్ముచ్యేత భీతస్తు ముచ్యేతాపన్న ఆపదః ॥ 8 ॥
ఈ స్తోత్ర పఠనం వల్ల రోగగ్రస్తుడు దీర్ఘ రోగాల డి విముక్తుడవుతాడు, కష్టాలలో చిక్కుకున్నవాడు బంధనాల నుండి విడిపింపబడతాడు, భయపడినవాడు భయం నుండి బయటపడతాడు, ఆపదలో ఉన్నవాడు సమస్త ఆపదల నుండి రక్షింపబడతాడు.
దుర్గాణ్యతితరత్యాశు పురుషః పురుషోత్తమమ్ ।
స్తువన్నామసహస్రేణ నిత్యం భక్తిసమన్వితః ॥ 9 ॥
నిత్యం భక్తి శ్రద్ధలతో ఆ పురుషోత్తముని ఈ వెయ్యి నామాలతో స్తుతించే మానవుడు, ఎలాంటి కష్టాలనైనా, దాటశక్యం కాని దుర్గమమైన పరిస్థితులనైనా సులభంగా, త్వరగా దాటేస్తాడు.
వాసుదేవాశ్రయో మర్త్యో వాసుదేవపరాయణః ।
సర్వపాపవిశుద్ధాత్మా యాతి బ్రహ్మ సనాతనం। ॥ 10 ॥
శ్రీ మహావిష్ణువునే ఆశ్రయించి, ఆయన యందే సర్వస్వము అర్పించిన మానవుడు, తన సమస్త పాపాల నుండి విముక్తి పొంది, పవిత్రమైన ఆత్మ కలవాడై, చివరకు శాశ్వతమైన మోక్షాన్ని చేరుకుంటాడు.
ఇలాంటి మరిన్ని స్తోత్రాలు, శ్లోకాలు, భక్తి విషయాల కోసం మా వెబ్సైట్లోని ఇతర పోస్ట్లను తప్పక చూడండి.
శ్రీ విష్ణు సహస్రనామ ఫలశ్రుతి తెలుగులో అర్థం 1-10 శ్లోకాలు
శ్రీ విష్ణు సహస్రనామ ఫలశ్రుతి తెలుగులో అర్థం 11-20 శ్లోకాలు
శ్రీ విష్ణు సహస్రనామ ఫలశ్రుతి తెలుగులో అర్థం 21-30 శ్లోకాలు
శ్రీ విష్ణు సహస్రనామ ఫలశ్రుతి తెలుగులో అర్థం 31-33 శ్లోకాలు
ఎన్నో స్తోత్రాలు, వాటి అర్థాలు తెలుగులో తెలుసుకోవాలనుకుంటే మన “భారతీయ సంస్కృతి” YouTube ఛానల్ను సందర్శించండి. 🙏
👉 భారతీయ సంస్కృతి YouTube Channel Link
ఈ సమాచారాన్ని వీడియొ రూపంలో చూడాలనుకుంటే ఈ లింక్ ఓపెన్ చేసి వీడియొ చూడండి 👇👇👇. మరెంతో ఆధ్యాత్మిక, ధార్మిక సమాచారం కోసం భారతీయ సంస్కృతి ఛానల్ ను subscribe చేసుకోండి.





