పురాణాలు » శ్రావణ మాస మాహాత్మ్యం » శ్రావణ మాస మహాత్మ్యం – పన్నెండవ అధ్యాయం
Swarna Gouri Vratam Mahima Telugu

శ్రావణ మాస మహాత్మ్యం – పన్నెండవ అధ్యాయం

పరమశివుడు సనత్కుమారునితో శ్రావణ మాస విశేషాలను ఇంకా ఇలా చెప్పడం ప్రారంభించాడు: “ఓ సనత్కుమారా! ఇప్పుడు ఎంతో శుభప్రదమైన స్వర్ణ గౌరీ వ్రతం గురించి చెబుతాను శ్రద్ధగా విను. ఈ వ్రతాన్ని శ్రావణ మాసం శుద్ధ తదియ నాడు ఆచరించాలి.

వ్రత విధానం: ఉదయాన్నే స్నానం చేసి, నిత్య కృత్యాలన్నీ పూర్తి చేసుకుని వ్రత సంకల్పం చేసుకోవాలి. పార్వతీ పరమేశ్వరులను పదహారు ఉపచారాలతో (షోడశోపచారాలతో) పూజించి, ‘ప్రపంచానికి ప్రభువైనవాడా! నేను చేసే ఈ పూజను స్వీకరించి, ఈ ప్రదేశానికి వచ్చి కొలువై ఉండు స్వామీ’ అని ప్రార్థించాలి. ఈ వ్రతం సంపూర్ణంగా పూర్తి అవ్వడానికి పదహారు మంది ముత్తైదువులకు వాయనాలను దానంగా ఇవ్వాలి.

దానికోసం వేయించిన బియ్యం, పదహారు రకాల పిండివంటలు నింపి, కొత్త బట్టలతో చుట్టిన పదహారు వెదురు పాత్రలను సిద్ధం చేసుకోవాలి. ఆ వాయనాలను ఇస్తూ… ‘నా వ్రతం పూర్తి అవ్వడానికి, ఐశ్వర్యం వృద్ధి చెందడానికి సర్వ అలంకారాలతో ఉన్న ముత్తైదువులకు వీటిని ఇస్తున్నాను’ అని సంకల్పించి దానమివ్వాలి. ఈ వ్రతాన్ని పదహారు సంవత్సరాలు కానీ, ఎనిమిది సంవత్సరాలు కానీ, నాలుగు లేదా ఒక్క సంవత్సరం కానీ తమ ఓపికను బట్టి చేసి, ఆ తర్వాత ఉద్యాపన చేయాలి. పూజ చేసిన తర్వాత ఈ వ్రత కథను తప్పక వినాలి”          అని చెప్పాడు.

చంద్రప్రభుని కథ: ఆ మాటలు విన్న సనత్కుమారుడు, “ఓ స్వామీ! పూర్వం ఈ వ్రతాన్ని ఎవరు చేశారు? ఆ కథ నాకు వివరంగా చెప్పండి” అని అడిగాడు. అందుకు పరమేశ్వరుడు ఇలా చెప్పాడు. “మునీశ్వరా! ఈ స్వర్ణ గౌరీ వ్రతం మనుషులకు సమస్త సంపదలనూ ఇస్తుంది. పూర్వకాలంలో సరస్వతీ నది ఒడ్డున ‘సువిల’ అనే పట్నం ఉండేది. దాన్ని పాలిస్తున్న ‘చంద్రప్రభుడు’ అనే రాజుకు కుబేరుడితో సమానమైన సంపద ఉండేది. ఆ రాజుకు ‘మహాదేవి’, ‘విశాల’ అనే ఇద్దరు అందమైన భార్యలు ఉన్నారు. వాళ్ళిద్దరిలో పెద్ద భార్య మహాదేవి అంటే రాజుకు చాలా ఇష్టం.

ఒకరోజు ఆ రాజు అడవికి వేటకు వెళ్ళాడు. రోజంతా వేటాడి అలసిపోయి, దాహంతో నీళ్ల కోసం అడవంతా తిరిగాడు. అలా తిరుగుతుంటే ఒకచోట ఎంతో అందమైన దేవతల కొలను సరోవరం ఆయనకు కనిపించింది. అక్కడికి వెళ్లి నీళ్లు తాగాడు. ఆ కొలను ఒడ్డున కొంతమంది అప్సరసలు దేవతా స్త్రీలు ఎంతో భక్తితో వ్రతం చేస్తున్నారు. అది చూసి ఆ రాజు అక్కడికి వెళ్లి, ‘మీరు చేస్తున్న ఈ వ్రతం ఏమిటి?’ అని అడిగాడు. దానికి ఆ స్త్రీలు, ‘ఓ రాజా! మేము చేస్తున్నది స్వర్ణ గౌరీ వ్రతం. ఇది సమస్త సంపదలనూ ఇస్తుంది. శ్రావణ మాసంలో వచ్చే తదియ నాడు ఈ వ్రతం చేసి, పదహారు దారపు పోగులతో చేసిన తోరాన్ని చేతికి కానీ, మెడలో కానీ కట్టుకోవాలి’ అని వివరించారు.

ఆ మాటలు విన్న రాజు వెంటనే అక్కడే ఆ స్వర్ణ గౌరీ వ్రతాన్ని భక్తితో ఆచరించి, పదహారు పోగులున్న తోరాన్ని కుడిచేతికి కట్టుకున్నాడు. వ్రతాన్ని పూర్తిచేసుకుని సంతోషంగా తన ఇంటికి వెళ్ళాడు.

కానీ రాజు ఇంటికి వెళ్లగానే, ఆయన కుడిచేతికి ఉన్న ఆ తోరాన్ని చూసి ఆయన పెద్ద భార్యకు విపరీతమైన కోపం వచ్చింది. రాజు వద్దని చెబుతున్నా వినకుండా, ఆమె ఆ తోరాన్ని తెంపేసి ఇంటి బయట ఎండిపోయి ఉన్న ఒక చెట్టు మీద పారేసింది. ఆ తోరం తగలగానే ఆశ్చర్యంగా ఆ ఎండిన చెట్టుకు వెంటనే చిగుళ్లు, పూలు వచ్చేసి పచ్చగా మారిపోయింది! ఇదంతా చూస్తున్న రాజుగారి రెండో భార్య ఎంతో ఆశ్చర్యపోయి, కింద పడిపోయిన ఆ తోరాన్ని తీసుకుని భక్తిగా తన చేతికి కట్టుకుంది. ఆ వ్రత మహిమ వల్ల, రాజుకు తన రెండో భార్య మీద విపరీతమైన ప్రేమ పెరిగిపోయింది.

మరోవైపు, పవిత్రమైన తోరాన్ని అవమానించినందుకు రాజుకు పెద్ద భార్య మీద తీవ్రమైన కోపం వచ్చి ఆమెను ఇంటినుంచి గెంటేశాడు. దాంతో ఆమె అడవుల పాలైంది. దిక్కుతోచక ఆ ఘోరమైన అడవిలో తిరిగి తిరిగి బాగా అలిసిపోయి, ఒకచోట కూర్చుండిపోయి ఏడవసాగింది.

శ్రావణ మాస విశిష్టతను సూచించే పవిత్ర శివలింగం, బిల్వదళాలు, అభిషేకం, చంద్రుడు మరియు భక్తి వాతావరణంతో కూడిన దివ్య చిత్రం.

ఆమె బాధను చూసి గౌరీదేవికి దయ కలిగి ఆమె ముందు ప్రత్యక్షమైంది. అప్పుడు ఆ రాజు భార్య.. గౌరీదేవిని ప్రార్థించింది. ఆ తర్వాత గౌరీదేవి ద్వారా స్వర్ణ గౌరీ వ్రతం గొప్పదనాన్ని తెలుసుకుని, అహంకారాన్ని వదిలేసి ఎంతో భక్తితో ఆ వ్రతాన్ని ఆచరించింది. గౌరీదేవి సంతోషించి ఆమెకు వరాలు ఇచ్చింది. ఆమె తన ఇంటికి తిరిగి వెళ్లగా, ఈ వ్రత మహిమ వల్ల రాజు మళ్ళీ ఆమెను ఇంట్లోకి చేర్చుకుని పూర్వంలాగే ఎంతో ప్రేమగా చూసుకున్నాడు.

ఆ తర్వాత ఆ రాజు తన ఇద్దరు భార్యల మీదా సమానమైన ప్రేమతో ఉంటూ, సమస్త సంపదలనూ అనుభవించి చాలాకాలం రాజ్యం చేసి… చివరికి మరణానంతరం వాళ్ళిద్దరితో కలిసి కైలాసానికి చేరుకున్నాడు. ఓ మునీశ్వరా! ఎంతో శుభప్రదమైన ఈ స్వర్ణ గౌరీ వ్రతాన్ని చేసేవాడు నాకూ, గౌరీదేవికీ ఎంతో ఇష్టమైనవాడు అవుతాడు. వాడు అపారమైన సంపదలను పొందుతాడు.

ఉద్యాపన విధానం: సనత్కుమారా! ఇప్పుడు ఈ స్వర్ణ గౌరీ వ్రతానికి ఉద్యాపన ఎలా చేయాలో చెబుతాను విను. మంచి తిథి, వారం అన్నీ కలిసొచ్చిన రోజున ఒక మండపాన్ని ఏర్పాటు చేసి, అక్కడ పద్మాన్ని గీసి ధాన్యాన్ని రాశిగా పోయాలి. ఆ ధాన్యం మీద కలశాన్ని పెట్టి అందులో పార్వతీ పరమేశ్వరులను ఆవాహన చేయాలి. ఆ రాత్రంతా జాగరణ చేయాలి.

మరుసటి రోజు ఉదయాన్నే నవగ్రహ హోమం చేసి, ఆ తర్వాత ప్రధాన దేవతకు హోమం చేయాలి. నువ్వులు, బియ్యం, నెయ్యి కలిపి తమ శక్తిని బట్టి వెయ్యి సార్లు కానీ, వంద సార్లు కానీ హోమం చేయాలి. ఆ తర్వాత ఆచార్యుడికి పూజ చేసి, పదహారు మంది దంపతులకు వాయన దానం ఇవ్వాలి. బ్రాహ్మణులకు భోజనాలు పెట్టి దక్షిణలు ఇచ్చి పంపించి… ఆ తర్వాత ఎంతో ఆనందంగా బంధువులందరితో కలిసి తాను భోజనం చేయాలి.” అని ఈశ్వరుడు సనత్కుమారుడికి ఈ వ్రత మహిమను వివరించాడు.

📥 ఈ అధ్యాయానికి సంబంధించిన తెలుగు PDF

ఈ అధ్యాయానికి సంబంధించిన పూర్తి తెలుగు PDFను డౌన్‌లోడ్ చేసుకోవాలనుకుంటున్నారా?

మా Bharatiya Samskruthi YouTube Channelలో చాలా తక్కువ మొత్తంతో Membershipలో చేరి, ఈ అధ్యాయంతో పాటు రాబోయే శ్రావణ మాస మహాత్మ్యం అన్ని అధ్యాయాల PDFలను,ఇతర స్తోత్రాల తెలుగు అర్థం pdf లను  సులభంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

🙏 ఈరోజే Memberగా చేరి అన్ని PDFలను పొందండి.

ఓం నమః శివాయ! 🕉️

 

శ్రావణ మాస మహాత్మ్యం

మొదటి అధ్యాయం: శ్రావణ మాస విశిష్టత

రెండవ అధ్యాయం: వ్రత నియమాలు, విశేషాలు

మూడవ అధ్యాయం: నక్త వ్రత పూజా విశేషాలు

నాలుగవ అధ్యాయం: విశేష వ్రతాలు, రుద్ర వర్తి వ్రత మహిమ

ఐదవ అధ్యాయం: కోటి లింగాల మహిమ, ఆదివార వ్రతం

ఆరవ అధ్యాయం: సోమవార వ్రత విశిష్టత

ఏడవ అధ్యాయం: మంగళగౌరీ వ్రత మహిమ, శ్రుతకీర్తి రాజు కథ

ఎనిమిదవ అధ్యాయం: బుధ, గురువార వ్రత విశిష్టత

తొమ్మిదవ అధ్యాయం: జీవంతికా దేవి వ్రత మహిమ

పదవ అధ్యాయం: శనివార వ్రత విశేషాలు

పదకొండవ అధ్యాయం: రోటక వ్రతం, ఔదుంబర వ్రత విశిష్టత

పన్నెండవ అధ్యాయం: స్వర్ణ గౌరీ వ్రత విశిష్టత

పదమూడవ అధ్యాయం: దూర్వా గణపతి వ్రత విశిష్టత

పదునాలుగవ అధ్యాయం: నాగ పంచమి వ్రత విశేషాలు

పదిహేనవ అధ్యాయం: సూపోదన వ్రతం, నాగ పంచమి విశేషాలు

పదహారవ అధ్యాయం: శీతలాష్టమి వ్రత విశిష్టత

పదిహేడవ అధ్యాయం: పవిత్రారోపణ వ్రతం, కుమారి పూజా మహిమ

పద్దెనిమిదవ అధ్యాయం: ఆషాఢ శుక్ల దశమి వ్రత మహిమ

పంతొమ్మిదవ అధ్యాయం: ఏకాదశీ వ్రతం, పవిత్రారోపణ వ్రత విశేషాలు

ఇరవయ్యవ అధ్యాయం: త్రయోదశీ మన్మథ పూజ, చతుర్దశి వ్రత విశేషాలు

ఇరవై ఒకటవ అధ్యాయం: త్రిమోదకి వ్రతం, రక్షాబంధన విశిష్టత

ఇరవై రెండవ అధ్యాయం: సంకష్టహరణ చతుర్థీ వ్రత మహిమ

ఇరవై మూడవ అధ్యాయం: శ్రీకృష్ణ జన్మాష్టమి వ్రత విశేషాలు

ఇరవై నాలుగవ అధ్యాయం: శ్రీకృష్ణ జన్మాష్టమి వ్రత మహిమ – ముగింపు

 

“శ్రావణ మాస మహాత్మ్యం ద్వారా మనం ఎన్నో వ్రతాల విశిష్టతలను, వాటి ఆధ్యాత్మిక ప్రయోజనాలను తెలుసుకున్నాం. ఈ పవిత్ర మాసంలో భక్తితో ఆచరించే ప్రతి వ్రతం మన జీవితంలో సుఖసంతోషాలను నింపుతుంది.

ఈ అద్భుతమైన సిరీస్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం 👉 భారతీయ సంస్కృతి YouTube Channel Link సబ్‌స్క్రైబ్ చేసుకోండి. హర హర మహాదేవ!”

ఈ సమాచారాన్ని వీడియొ రూపంలో చూడాలనుకుంటే ఈ లింక్ ఓపెన్ చేసి వీడియొ చూడండి 👇👇👇. మరెంతో ఆధ్యాత్మిక, ధార్మిక సమాచారం కోసం భారతీయ సంస్కృతి ఛానల్ ను subscribe చేసుకోండి.

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
Scroll to Top