పురాణాలు » వైశాఖ పురాణం 26వ అధ్యాయము
వైశాఖ పురాణం 26వ అధ్యాయము

వైశాఖ పురాణం 26వ అధ్యాయము

నారద మహర్షి అంబరీష మహారాజుకు వైశాఖ పురాణంలోని విశేషాలను వివరిస్తూ ఇలా అన్నారు. మర్రిచెట్టు కూలిపోవడం, అందులో నుంచి వచ్చిన భయంకరమైన పాము దివ్య పురుషుడిగా మారి నమస్కరించడం చూసి శంఖుడు, ఆ బోయవాడు ఇద్దరూ ఆశ్చర్యపోయారు. శంఖుడు ఆ పురుషుడిని దగ్గరకు పిలిచి, అసలు నువ్వు ఎవరు, నీకు ఈ గతి ఎందుకు పట్టింది, ఇప్పుడు ఎలా శాప విముక్తి కలిగింది అని వివరంగా అడిగాడు. అప్పుడు ఆ దివ్య పురుషుడు భక్తితో నమస్కరించి తన కథను ఇలా చెప్పాడు. ఆయన పేరు రోచనుడు, ప్రయాగ క్షేత్రంలో నివసించే కుసీదుడు అనే ముని కొడుకు. తనకు చదువు, అందం, సంపద ఉన్నాయని చాలా గర్వపడేవాడు. ఎప్పుడూ సోమరితనంతో నిద్రపోతూ, జూదం ఆడుతూ, వడ్డీ వ్యాపారం చేస్తూ కాలం గడిపేవాడు. పైకి మాత్రం సంధ్యావందనం చేస్తున్నట్లు నటించేవాడు కానీ, మనసులో అసలు భక్తి ఉండేది కాదు.

ఒకసారి వైశాఖ మాసంలో జయంతుడు అనే బ్రాహ్మణుడు వాళ్ల ఊరికి వచ్చి వైశాఖ వ్రతాల గురించి, విష్ణు కథల గురించి చెబుతుంటే ఊరంతా భక్తితో వింటున్నారట. ఆ సభను చూడాలనే కుతూహలంతో రోచనుడు విలాసంగా తయారై, తాంబూలం నములుతూ అక్కడికి వెళ్లాడు. భక్తితో కథ వింటున్న వారిని వెక్కిరిస్తూ, ఒకరి బట్టలు లాగుతూ అల్లరి చేశాడు. ఆ పుణ్య కథలకు ఆటంకం కలిగించిన పాపం వల్ల రోచనుడు రోగాల పాలై చనిపోయి, నరకంలో ఘోరమైన శిక్షలు అనుభవించాడు. ఆ తర్వాత ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో పుట్టి చస్తూ, చివరికి భయంకరమైన పాముగా మారి పదివేల ఏళ్లు ఆ మర్రిచెట్టు తొర్రలో ఆకలితో అలమటించాడు. కానీ ఇప్పుడు శంఖుడు చెప్పిన వైశాఖ మహిమను వినడం వల్ల అతని పాపాలన్నీ పోయి మళ్ళీ దివ్య రూపం వచ్చింది. ఇదంతా తన అదృష్టమని, సజ్జనుల సాంగత్యం ఎప్పుడూ మేలే చేస్తుందని ఆ దివ్య పురుషుడు శంఖుడికి కృతజ్ఞతలు చెప్పుకున్నాడు.

శంఖుడు ఆ దివ్య పురుషుడిని ప్రేమగా లేవనెత్తి, నువ్వు వచ్చే జన్మలో వేదశర్మ అనే బ్రాహ్మణుడిగా పుట్టి వేదాలన్నీ చదువుతావని దీవించాడు. నీవు వైశాఖ ధర్మాలు పాటిస్తూ చివరికి విష్ణులోకానికి చేరుకుంటావని చెప్పాడు. భయం వల్లనో, కోపం వల్లనో, చివరకు తమాషాగా అన్నా సరే శ్రీహరి నామం పలికితే చాలు పాపాలు పోతాయని, అలాంటిది భక్తితో స్మరిస్తే ఇంకెంత పుణ్యం వస్తుందో ఆలోచించమని చెప్పాడు. శ్రీహరి భక్తులకు కష్టాలు ఉండవని, ఆయన మనఃపూర్వకమైన భక్తికే లొంగుతాడని వివరిస్తూ, ఎప్పుడూ సజ్జనుల సాంగత్యంలో ఉండమని హితవు పలికాడు. ఆ దివ్య పురుషుడు శంఖుడికి నమస్కరించి సెలవు తీసుకుని స్వర్గానికి వెళ్లిపోయాడు.

ఆ తర్వాత శంఖుడు ఆ బోయవాడిని కూడా కరుణించి, అతనికి ‘రామ’ అనే రెండక్షరాల మంత్రాన్ని ఉపదేశించాడు. వెయ్యి విష్ణు నామాలతో సమానమైన శక్తి ఆ రామ నామానికి ఉందని, బ్రతికి ఉన్నంత కాలం వైశాఖ ధర్మాలను పాటించమని చెప్పి తన దారిన తాను వెళ్ళిపోయాడు. ఆ బోయవాడు శంఖుడిని వదలలేక ఎంతో బాధపడ్డాడు. కానీ ఆయన చెప్పినట్టే అడవిలో ఒక అందమైన తోటను పెంచి, బాటసారులకు నీరు, నీడ, పండ్లు ఇస్తూ సేవ చేశాడు. రాత్రింబగళ్లు రామ నామాన్ని జపించేవాడు. అలా ఆ జన్మ ముగిశాక, అతను కృష్ణుడు అనే ముని కొడుకుగా పుట్టాడు. ఆ ముని తీవ్రమైన తపస్సులో ఉండగా అతని చుట్టూ పుట్ట అంటే వల్మీకం పెరగడం వల్ల ఆయనను వల్మీక ముని అని పిలిచేవారు. ఆయన కొడుకే వాల్మీకిగా మారి, మనకు పవిత్రమైన రామాయణ మహాకావ్యాన్ని అందించాడు. అలా ఒకప్పటి క్రూరమైన బోయవాడు వైశాఖ మహిమ వల్ల గొప్ప మహర్షిగా మారి అందరి హృదయాల్లో నిలిచిపోయాడని శ్రుతదేవ మహాముని శ్రుతకీర్తికి వివరించారు. ఈ కథను విన్న వారికి పునర్జన్మ ఉండదని నారదుడు అంబరీషుడితో చెప్పి వైశాఖ పురాణాన్ని ముగించాడు.

 వైశాఖ పురాణం ఇరవై ఆరవ అధ్యాయము సంపూర్ణము

ఇరవై ఏడవ అధ్యాయం కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

వైశాఖ పురాణం 1-30 అధ్యాయాలు

వైశాఖ పురాణము (Vaisakha Puranam) లోని అధ్యాయములు:

1వ అధ్యాయం – వైశాఖమాస ప్రశంస

2వ అధ్యాయం – వైశాఖ మాసమున చేయవలసిన వివిధ దానములు – వాటి  ఫలితములు

3వ అధ్యాయం – వివిధ దానములు – వాటి మహత్యములు

4వ అధ్యాయం – వైశాఖ ధర్మ ప్రశంస

5వ అధ్యాయం – వైశాఖమాస విశిష్టత

6వ అధ్యాయం – జలదాన మహత్యము – గృహగోధికా కథ

7వ అధ్యాయం – వైశాఖమాస  దానములు

8వ అధ్యాయం – పిశాచ మోక్షము

9వ అధ్యాయం – సతీ దేహత్యాగము

10వ అధ్యాయం – దక్షయజ్ఞ నాశము – కామదహనము

11వ అధ్యాయం – రతి దుఃఖము – దేవతల ఊరడింపు

12వ అధ్యాయం – కుమార జననము

13వ అధ్యాయం – అశూన్య శయన వ్రతము

14వ అధ్యాయం – ఛత్రదాన మహిమ

15వ అధ్యాయం – వైశాఖవ్రత మహిమ

16వ అధ్యాయం – యముని పరాజయము

17వ అధ్యాయం – యమ దుఃఖ నిరూపణము

18వ అధ్యాయం – విష్ణువు యముని ఊరడించుట

19వ అధ్యాయం – పిశాచత్వ విముక్తి

20వ అధ్యాయం – పాంచాలరాజు రాజ్యప్రాప్తి

21వ అధ్యాయం – పాంచాలరాజు సాయుజ్యము

22వ అధ్యాయం – దంతిల కోహల శాపవిముక్తి

23వ అధ్యాయం – కిరాతుని పూర్వజన్మ

24వ అధ్యాయం – వాయుశాపము

25వ అధ్యాయం – భాగవత ధర్మములు

26వ అధ్యాయం – వాల్మీకి జన్మ

27వ అధ్యాయం – కలిధర్మములు – పితృముక్తి

28వ అధ్యాయం – అక్షయతృతీయ విశిష్టత

29వ అధ్యాయం – శునీ మోక్షప్రాప్తి

30వ అధ్యాయం – పుష్కరిణి – ఫలశ్రుతి

శ్రీ మహావిష్ణువుకు ప్రీతిపాత్రమైన వైశాఖ మాసంలో సూర్యోదయ సమయమున నదీస్నానం ఆచరించి, పూజలు, జపాలు, దానాలు భక్తితో నిర్వహించి, వైశాఖ పురాణాన్ని పఠించినవారిపై శ్రీహరి ప్రసన్నుడగును. ఆయన అనుగ్రహంతో భక్తులకు పాప విముక్తి కలిగి, వైకుంఠ ప్రాప్తి సాధ్యమగును. 🙏

 

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
Scroll to Top