వైశాఖ పురాణం 24 వ అధ్యాయము
నారద మహర్షి అంబరీష మహారాజుతో వైశాఖ మాస విశిష్టతను వివరిస్తూ శంఖుడు మరియు కిరాతుడి మధ్య జరిగిన సంభాషణను ఇలా కొనసాగించారు. శంఖ మహాముని చెప్పిన విషయాలు విన్న కిరాతుడు ఎంతో వినయంగా.. స్వామీ, విష్ణువును పూజించడం గొప్పదని చెప్పారు కదా, అసలు ఆ విష్ణువు ఎవరు? ఆయన లక్షణాలు ఏంటి? ఆయన్ని ఎలా తెలుసుకోవాలి? ఏ పనులు చేస్తే ఆయన సంతోషిస్తాడు? అని అడిగాడు. అప్పుడు శంఖుడు చిరునవ్వుతో ఇలా వివరించాడు.. నాయనా, శ్రీమహావిష్ణువు రూపం పాపాలకు అందనిది, మన ఆలోచనలకు కూడా అందనిది. ఆయన బ్రహ్మ మొదలైన దేవతలకు కూడా పూర్తిగా అర్థం కానివాడు. ఆయన సృష్టికర్తలకు కూడా అధిపతి. గుణాలకు అతీతుడు, అనంతుడు మరియు సచ్చిదానంద స్వరూపుడు. ఈ ప్రపంచంలో అన్నీ నశించినా ఆయన స్థానం మాత్రం శాశ్వతంగా ఉంటుంది. సృష్టి, స్థితి, లయ అన్నీ ఆయన వల్లనే జరుగుతాయి. వేదాలు, శాస్త్రాలు, పురాణాలు మరియు ఇతిహాసాల ద్వారా మాత్రమే ఆయన్ని తెలుసుకోవడం సాధ్యం. కేవలం తర్కంతో లేదా ఇంద్రియాలతో ఆ పరమాత్మను ఎవరూ గ్రహించలేరు.
లోకంలో గొప్పతనాన్ని బట్టి ఒక క్రమం ఉంటుందని శంఖుడు వివరించాడు. సామాన్య మనుషుల కంటే రాజు గొప్పవాడు, రాజు కంటే గంధర్వులు, వారి కంటే దేవతలు గొప్పవారు. ఇలా ఒక్కొక్కరి కంటే మరొకరు శక్తివంతులు. దేవతల కంటే సప్తర్షులు, వారి కంటే అగ్ని, సూర్యుడు, గురువు ఇలా వెళ్తే ఇంద్రుడు వస్తాడు. ఇంద్రుడి కంటే గిరిజాదేవి, ఆమె కంటే శివుడు, శివుడి కంటే బుద్ధి, బుద్ధి కంటే ‘మహాప్రాణము’ (ప్రాణ దేవుడు) చాలా గొప్పవి. ఈ ప్రాణము నుండే సమస్త విశ్వం పుట్టింది, అన్నీ ప్రాణం మీదనే ఆధారపడి ఉన్నాయి. ప్రాణం వల్లనే సర్వము కదులుతోంది. లక్ష్మీదేవి కటాక్షం వల్ల ప్రాణం నిలిచి ఉంటే, ఆ లక్ష్మీదేవికి శ్రీమన్నారాయణుడే ఆధారం. ఆ విష్ణువు కంటే గొప్పవారు గానీ, సమానులు గానీ ఈ సృష్టిలో ఎవరూ లేరు. ఇదంతా విన్న కిరాతుడు.. స్వామీ, ప్రాణము అన్నిటికంటే గొప్పదని ఎలా చెప్పగలరు? అని అడగగా శంఖుడు ఒక కథ చెప్పాడు.
పూర్వం శ్రీమహావిష్ణువు దేవతల్లో ఎవరు గొప్పవారో తేల్చాలనుకున్నారు. “మీలో ఎవరు గొప్పవారో వారినే బ్రహ్మ దేవుడి తర్వాత యువరాజుగా చేస్తాను” అని ఆయన ఒక పరీక్ష పెట్టారు. ఒక స్థూల శరీరంలో దేవతలందరూ తమ అంశలతో నివసిస్తుంటారు. ఏ దేవుడు బయటకు వెళ్తే ఆ శరీరం పడిపోతుందో, మళ్ళీ ఎవరు ప్రవేశిస్తే అది లేస్తుందో వారే గొప్పవారని నిర్ణయించారు. ముందుగా పాదాలకు అధిపతి అయిన జయంతుడు బయటకు వెళ్తే శరీరం కుంటిదైంది కానీ పడిపోలేదు. కళ్లకు అధిపతి సూర్యుడు వెళ్తే గుడ్డిదైంది కానీ ప్రాణం పోలేదు. ఇలా చెవులు, ముక్కు, నాలుక వంటి ఇంద్రియాలకు అధిపతులైన దేవతలందరూ ఒక్కొక్కరుగా వెళ్ళినా శరీరం ఏదో ఒక లోపంతో బతికే ఉంది. కానీ ఎప్పుడైతే ‘ప్రాణము’ బయటకు వచ్చిందో, ఆ శరీరం వెంటనే నిశ్చేష్టమై కింద పడిపోయింది. మళ్ళీ దేవతలందరూ లోపలికి వెళ్ళినా ఆ శరీరం లేవలేదు, కానీ ప్రాణము లోపలికి ప్రవేశించగానే అది వెంటనే లేచి నిలబడింది. దీన్ని బట్టి ప్రాణమే సర్వోత్తమమని దేవతలందరూ అంగీకరించారు. విష్ణువు తప్ప మిగిలిన ఏ దేవుడూ ప్రాణాన్ని కాదనలేరు.
ప్రాణము ఇంత గొప్పదయితే మరి లోకంలో ఆయన మహిమ ఎందుకు అంతగా ప్రసిద్ధి చెందలేదని కిరాతుడు అడిగాడు. దానికి శంఖుడు ఇలా జవాబిచ్చాడు.. పూర్వం ప్రాణ పురుషుడు గంగా తీరంలో అశ్వమేధ యాగం చేయడానికి సిద్ధమయ్యాడు. ఆ సమయంలో నాగళ్లతో నేలను దున్నిస్తుండగా, అక్కడ ఒక పుట్టలో తపస్సు చేసుకుంటున్న కణ్వ మహామునికి ఆ నాగలి తగిలి తపోభంగం అయింది. కోపించిన ముని.. “అందరిలో నేనే గొప్పవాడిని అని గర్వంతో నా తపస్సును పాడు చేశావు కాబట్టి, ముల్లోకాల్లో నీకు ప్రఖ్యాతి ఉండదు, భూలోకంలో నీ గురించి ఎవరూ చెప్పుకోరు” అని శపించాడు. దానికి ప్రాణ దేవుడు కూడా కోపంతో.. “నేను తెలియక చేసిన పనికి నన్ను శపించావు కాబట్టి నువ్వు గురువుకే ద్రోహం చేస్తావు” అని ఎదురు శాపం ఇచ్చాడు. ఆ కణ్వ మహాముని శాపం వల్లే ప్రాణ దేవుడి మహిమ లోకంలో అంతగా ప్రసిద్ధి చెందలేదని శంఖుడు వివరించాడు. ఇదీ వైశాఖ పురాణంలోని కథ అని నారద మహర్షి అంబరీషుడికి తెలియజేశారు.
వైశాఖ పురాణం ఇరవై నాలుగవ అధ్యాయము సంపూర్ణము
ఇరవై ఐదవ అధ్యాయం కోసం ఇక్కడ క్లిక్ చేయండి
వైశాఖ పురాణం 1-30 అధ్యాయాలు

వైశాఖ పురాణము (Vaisakha Puranam) లోని అధ్యాయములు:
2వ అధ్యాయం – వైశాఖ మాసమున చేయవలసిన వివిధ దానములు – వాటి ఫలితములు
3వ అధ్యాయం – వివిధ దానములు – వాటి మహత్యములు
4వ అధ్యాయం – వైశాఖ ధర్మ ప్రశంస
5వ అధ్యాయం – వైశాఖమాస విశిష్టత
6వ అధ్యాయం – జలదాన మహత్యము – గృహగోధికా కథ
10వ అధ్యాయం – దక్షయజ్ఞ నాశము – కామదహనము
11వ అధ్యాయం – రతి దుఃఖము – దేవతల ఊరడింపు
13వ అధ్యాయం – అశూన్య శయన వ్రతము
17వ అధ్యాయం – యమ దుఃఖ నిరూపణము
18వ అధ్యాయం – విష్ణువు యముని ఊరడించుట
19వ అధ్యాయం – పిశాచత్వ విముక్తి
20వ అధ్యాయం – పాంచాలరాజు రాజ్యప్రాప్తి
21వ అధ్యాయం – పాంచాలరాజు సాయుజ్యము
22వ అధ్యాయం – దంతిల కోహల శాపవిముక్తి
23వ అధ్యాయం – కిరాతుని పూర్వజన్మ
27వ అధ్యాయం – కలిధర్మములు – పితృముక్తి
28వ అధ్యాయం – అక్షయతృతీయ విశిష్టత
29వ అధ్యాయం – శునీ మోక్షప్రాప్తి
30వ అధ్యాయం – పుష్కరిణి – ఫలశ్రుతి
శ్రీ మహావిష్ణువుకు ప్రీతిపాత్రమైన వైశాఖ మాసంలో సూర్యోదయ సమయమున నదీస్నానం ఆచరించి, పూజలు, జపాలు, దానాలు భక్తితో నిర్వహించి, వైశాఖ పురాణాన్ని పఠించినవారిపై శ్రీహరి ప్రసన్నుడగును. ఆయన అనుగ్రహంతో భక్తులకు పాప విముక్తి కలిగి, వైకుంఠ ప్రాప్తి సాధ్యమగును. 🙏


