వైశాఖ పురాణం 15 వ అధ్యాయము
వైశాఖవ్రత మహిమ
శ్రుతకీర్తి మహారాజు శ్రుతదేవ మునితో “మునీశ్వరా! వైశాఖ ధర్మాలు ఇంత సులభంగా ఉండి, విష్ణువుకు ఎంతో ఇష్టమై, మోక్షాన్ని ఇచ్చేవి కదా! మరి ఇవి లోకంలో ఎందుకు అంతగా ప్రసిద్ధి చెందలేదు? చాలామంది కష్టమైన యజ్ఞాలు, ఎక్కువ ఖర్చుతో కూడిన పనులు (రాజస, తామస ధర్మాలు) లేదా మాఘ మాస వ్రతాల గురించి గొప్పగా చెప్పుకుంటారు కదా, దీనికి కారణం ఏంటి?”
దానికి శ్రుతదేవుడు ఇలా సమాధానం ఇచ్చారు: “రాజా! లోకంలో జనం ఎక్కువగా తమ సుఖం కోసం, పిల్లల కోసం, సంపదల కోసం ఆశపడతారు. అందుకే వారు ఆర్భాటంగా ఉండే కష్టమైన పనుల వైపు మొగ్గు చూపుతారు. మోక్షం కోసం ప్రయత్నించే వారు చాలా తక్కువ. వైశాఖ ధర్మాలు ‘సాత్త్వికమైనవి’, అంటే నిగూఢంగా ఉండి భగవంతుడికి దగ్గర చేస్తాయి. ఈ విషయం తెలియని మూర్ఖులు కేవలం పదవుల కోసం, ఆధిపత్యం కోసం ప్రాకులాడుతూ అసలైన పురుషార్థాన్ని మర్చిపోతున్నారు.” వైశాఖ ధర్మాలు లోకంలో ఎలా వ్యాపించాయో చెప్పడానికి ఒక కథ ఉంది.
పూర్వం కాశీ రాజుగా కీర్తిమంతుడు అనే ధర్మపరుడు, జితేంద్రియుడు రాజు ఉండేవాడు. ఒకసారి వేటకై అడవికి వెళ్లినప్పుడు యాదృచ్ఛికంగా వశిష్ఠ మహర్షి ఆశ్రమ పరిసరాలకు చేరుకున్నాడు. అది వైశాఖ మాసం కావడంతో అక్కడి వాతావరణం ఎంతో పవిత్రంగా, సేవా భావంతో నిండి కనిపించింది. ఆశ్రమంలో వశిష్ఠ మహర్షి శిష్యులు ఎంతో భక్తితో, కరుణతో ప్రజలకు సేవ చేస్తూ కనిపించారు. దారిలో ప్రయాణించే బాటసారుల కోసం చలివేంద్రాలు ఏర్పాటు చేసి, ఎండలో అలసిపోయిన వారికి చల్లని నీరు అందిస్తూ ఉండేవారు. నీడనిచ్చే చెట్ల కింద వారిని కూర్చోబెట్టి విసనకర్రలతో మెల్లగా వీచి శరీరానికి చల్లదనాన్ని కలిగించేవారు.
అంతేకాకుండా, వారికి చెరకు గడలు, పండ్లు, గంధం వంటి వాటిని ఇచ్చి శరీరానికి శాంతిని, మనసుకు ఆనందాన్ని కలిగించేవారు. మధ్యాహ్న సమయంలో గొడుగులు దానం చేసి ఎండ నుంచి రక్షణ కల్పించగా, సాయంత్రం వేళ పానకం, తాంబూలం ఇచ్చి అతిథి సత్కారం చేసేవారు. ప్రయాణం వల్ల అలసిపోయిన వారు సేదతీరేందుకు ఇసుక తిన్నెలు ఏర్పాటు చేసి, ఉయ్యాలలు కట్టి విశ్రాంతి తీసుకునేలా ఏర్పాట్లు చేశారు. ఈ విధంగా శిష్యులు చేస్తున్న సేవా కార్యక్రమాలు చూసిన రాజు కీర్తిమంతుడు ఆశ్చర్యంతో పాటు ఆనందానికి లోనయ్యాడు, వైశాఖ మాసంలో చేసే ఈ సేవల మహిమను అర్థం చేసుకోవాలనే ఆసక్తి అతనిలో మరింత పెరిగింది.
రాజు వారిని అడగగా, “ఇవి మా గురువుగారు చెప్పిన వైశాఖ ధర్మాలు” అని వారు చెప్పారు. రాజు నేరుగా వశిష్ఠ మహర్షి దగ్గరకు వెళ్లి, ఆ ధర్మాల గురించి ఇంకా వివరంగా చెప్పమని ప్రార్థించాడు.
వశిష్ఠ మహర్షి రాజుతో “రాజా! విష్ణువుకు భక్తి అంటేనే ఇష్టం. వేల రూపాయలు ఖర్చు పెట్టి చేసే పనుల కంటే, భక్తితో చేసే చిన్న పనికైనా ఆయన సంతోషిస్తారు. వైశాఖంలో స్నాన, దానాలు చేయని వారు ఎంత గొప్ప కులంలో పుట్టినా వారు నీచులే. ఈ మాసంలో చేసే స్వల్ప కర్మకైనా భగవంతుడు అఖండ ఫలితాన్ని ఇస్తాడు. కాబట్టి నువ్వు ఈ ధర్మాలను పాటించడమే కాకుండా, నీ దేశ ప్రజల చేత కూడా చేయించు” అన్నాడు.
మహర్షి మాటలతో ప్రభావితుడైన కీర్తిమంతుడు తన రాజ్యానికి వెళ్లి ఒక కఠినమైన ఆజ్ఞ జారీ చేశాడు
“గ్రామ గ్రామాన చాటింపు వేయండి! 8 ఏళ్ల పిల్లల నుండి 80 ఏళ్ల ముసలివారి వరకు ప్రతి ఒక్కరూ వైశాఖ మాసంలో సూర్యోదయానికి ముందే స్నానం చేసి, వైశాఖ ధర్మాలను పాటించాలి. ఎవరైనా ఈ వ్రతాన్ని చేయకపోతే వారు నా తండ్రి అయినా, కొడుకైనా సరే.. వారికి ఉరిశిక్ష లేదా దేశ బహిష్కరణ తప్పదు” అన్నాడు
రాజు ఆజ్ఞ ప్రకారం ఊరువాడా అందరూ భక్తితో వైశాఖ వ్రతం చేయడం మొదలుపెట్టారు. దానధర్మాలు, చలివేంద్రాలు రాజ్యమంతా వెలిశాయి.
కీర్తిమంతుడి పాలనలో ప్రజలందరూ వైశాఖ వ్రతం చేయడం వల్ల అద్భుతం జరిగింది. ఆ రాజ్యంలో చనిపోయిన ప్రతి ఒక్కరూ నేరుగా విష్ణులోకానికి (వైకుంఠానికి) వెళ్లడం మొదలుపెట్టారు.
వారు గతంలో ఎన్ని పాపాలు చేసినా, వైశాఖ స్నాన మహిమ వల్ల ఆ పాపాలు తుడిచిపెట్టుకుపోయాయి. దీనివల్ల యమలోకంలో నరకాలు ఖాళీ అయిపోయాయి. చిత్రగుప్తుడికి పాపాలు రాసే పనే లేకుండా పోయింది. ప్రజలు యజ్ఞాలు చేయకుండా కేవలం వైశాఖ వ్రతంతోనే మోక్షం పొందుతుండటంతో స్వర్గలోకం కూడా ఖాళీ అయిపోయింది.
వైశాఖ పురాణం పదిహేనవ అధ్యాయం సంపూర్ణం.
పదహారవ అధ్యాయం కోసం ఇక్కడ క్లిక్ చేయండి
వైశాఖ పురాణం 1-30 అధ్యాయాలు

వైశాఖ పురాణము (Vaisakha Puranam) లోని అధ్యాయములు:
2వ అధ్యాయం – వైశాఖ మాసమున చేయవలసిన వివిధ దానములు – వాటి ఫలితములు
3వ అధ్యాయం – వివిధ దానములు – వాటి మహత్యములు
4వ అధ్యాయం – వైశాఖ ధర్మ ప్రశంస
5వ అధ్యాయం – వైశాఖమాస విశిష్టత
6వ అధ్యాయం – జలదాన మహత్యము – గృహగోధికా కథ
10వ అధ్యాయం – దక్షయజ్ఞ నాశము – కామదహనము
11వ అధ్యాయం – రతి దుఃఖము – దేవతల ఊరడింపు
13వ అధ్యాయం – అశూన్య శయన వ్రతము
17వ అధ్యాయం – యమ దుఃఖ నిరూపణము
18వ అధ్యాయం – విష్ణువు యముని ఊరడించుట
19వ అధ్యాయం – పిశాచత్వ విముక్తి
20వ అధ్యాయం – పాంచాలరాజు రాజ్యప్రాప్తి
21వ అధ్యాయం – పాంచాలరాజు సాయుజ్యము
22వ అధ్యాయం – దంతిల కోహల శాపవిముక్తి
23వ అధ్యాయం – కిరాతుని పూర్వజన్మ
27వ అధ్యాయం – కలిధర్మములు – పితృముక్తి
28వ అధ్యాయం – అక్షయతృతీయ విశిష్టత
29వ అధ్యాయం – శునీ మోక్షప్రాప్తి
30వ అధ్యాయం – పుష్కరిణి – ఫలశ్రుతి
శ్రీ మహావిష్ణువుకు ప్రీతిపాత్రమైన వైశాఖ మాసంలో సూర్యోదయ సమయమున నదీస్నానం ఆచరించి, పూజలు, జపాలు, దానాలు భక్తితో నిర్వహించి, వైశాఖ పురాణాన్ని పఠించినవారిపై శ్రీహరి ప్రసన్నుడగును. ఆయన అనుగ్రహంతో భక్తులకు పాప విముక్తి కలిగి, వైకుంఠ ప్రాప్తి సాధ్యమగును. 🙏


